Asaduddin Owaisi: ముంబైలో ఒవైసీకి చేదు అనుభవం.. బూటు దాడి!

  • దక్షిణ ముంబై బహిరంగసభలో ఘటన
  • ప్రసంగిస్తుండగా బూటు దాడి
  • ఇలాంటి దాడులు తనను అడ్డుకోలేవన్న ఒవైసీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చేదు అనుభవం ఎదురైంది. దక్షిణ ముంబైలోని నాగ్ పదలో నిన్న రాత్రి జరిగిన ఓ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తుండగా... ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా, కొంచెం పక్కనుంచి వెళ్లిపోయింది. ఘటనతో ఏమాత్రం బెదరని ఒవైసీ...  ఆ తర్వాత తన ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు. ఈ ఘటన రాత్రి 9.45 గంటల సమయంలో చోటు చేసుకుంది. ట్రిపుల్ తలాక్ పై ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.

ట్రిపుల్ తలాక్ ను సాధారణ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు అంగీకరించడం లేదనే విషయాన్ని అధికారపక్ష నేతలు గుర్తించడం లేదని ఈ సందర్భంగా ఒవైసీ మండిపడ్డారు. వీళ్లంతా అసహనంతో ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెడతానని చెప్పారు.

మహాత్మాగాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవిండ్ పన్సారేలను చంపిన హంతకుల భావజాలాన్నే తనపై బూటు దాడి చేసిన వారు కూడా అనుసరిస్తున్నారని అన్నారు. విద్వేష భావజాలంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు రోజురోజుకూ బలోపేతం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడనీయకుండా ఇలాంటి దాడులు తనను అడ్డుకోలేవని చెప్పారు.  

  • Loading...

More Telugu News