Vizag: అందం, ఒంటరితనమే శాపమైందా?... విశాఖలో అనుమానాస్పద స్థితిలో యాంకర్ మృతి!

  • ఒడిశా నుంచి వచ్చిన జంట
  • మ్యూజికల్ నైట్స్ నిర్వహించే భర్త, సహకరించే భార్య
  • విభేదాలతో విడిపోగా, ఒంటరిగా ఉంటున్న యువతి
  • చంపేసి, దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఆమె అందంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తుండేది. స్వయంగా యాంకరింగ్ చేసేది. అంతలోనే భర్తతో విభేదాలు వచ్చాయి. విసుగుతో అతనికి దూరం జరిగింది. విడిగా, ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి చేరింది. ఏం జరిగిందో ఏమో... విగతజీవిగా కనిపించింది. ఆమెను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాన్ని దహనం చేశారు.

విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతమైన కొత్తపాలెంలో కలకలం రేపిందీ ఘటన. స్థానికులు వెల్లడిస్తున్న మరింత సమాచారం ప్రకారం, ఒడిశాకు చెందిన ఓ యువజంట నాలుగు నెలల క్రితం గోపాలపట్నం వచ్చి నివాసం ఏర్పరచుకుంది. భర్త హైదరాబాద్, ఒడిశా తదితర ప్రాంతాల్లో నిర్వహించే మ్యూజికల్ నైట్స్ కు భార్యతో కలసి వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి వస్తుండేవాడు. ఆపై వారి కాపురంలో కలహాలు చోటు చేసుకోగా, భర్తతో విడిపోయిన ఆమె, ఒంటరిగా సంతోషినగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.

కొత్త ప్రాంతం కావడం, తెలుగు సరిగ్గా రాకపోవడంతో పాటు చూడగానే ఆకర్షించే అందం ఆమె సొంతం కావడంతో, అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆమెపై కన్నేశారు. ఓ వ్యక్తి తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవాడని, అతనే తన స్నేహితుల సాయంతో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆమె మృతి విషయం తెలుసుకున్న పోలీసులు, కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగారు.

ఆమెతో కలిసున్న వ్యక్తులు, ఇటీవలి కాలంలో ఆమెను కలిసిన వారి వివరాల కోసం షీలానగర్, నరవ, గాజువాక, కొత్తపాలెం, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో భర్తకు సంబంధం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని అంటున్నారు.

  • Loading...

More Telugu News