KTR: సామాన్యుడికి అందని సాంకేతిక ఫలాలు నిష్ప్రయోజనం!: మంత్రి కేటీఆర్

  • టి-సాట్ కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవ సభ
  • సీఈవోకు కేటీఆర్ అభినందనలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగస్వామ్యం కోసం ఉమ్మడి కార్యాచరణ 

సాంకేతిక ఫలాలు సామాన్యుడికి అందినపుడే నిజమైన పురోభివృద్ధి అని రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ టి-సాట్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రథమ వార్షికోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. టి-సాట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కట్ చేశారు. అనంతరం, సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు సాంకేతిక ఫలాలు అంది, వాటి ద్వారా ప్రయోజనం పొందినపుడే నిజమైన సాంకేతికత సాధించినట్లుగా భావించాలని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ప్రస్తావించారు. తాను సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్నందున ముఖ్యమంత్రి పలుమార్లు ఈ విషయాన్ని తనకు సూచించేవారని సభలో వెల్లడించారు.

గత ఏడాది ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఇక్కడే డిజిటల్ తరగతులను ప్రారంభించి లక్షలాది విద్యార్థులకు డిజిటల్ బోధన అందించగలుగుతున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షల విషయంలో టి-సాట్ సేవలు మంచి ఆదరణ పొందాయని, పోటీ పరీక్షల ప్రకటన వెలువడగానే టి-సాట్ ప్రసారాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు టి-సాట్, ఉన్నత విద్యాశాఖ కలసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. మారుమూల ప్రాంత నిరుద్యోగ యువతను చైతన్య పరిచేందుకు జిల్లాల వారీగా చేపట్టే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

టి-సాట్ 2,00,000 సబ్ స్రైబ్స్, 31 మిలియన్ల వీవ్స్ తో సంతృప్తి చెందకుండా
ప్రైవేటు సంస్థలకు పోటీగా రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. కాగా, తొలుత కార్యాలయ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.పాపిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో తెలంగాణ అభ్యర్థుల భాగసామ్యం నామమాత్రంగానే ఉందని, ప్రస్తుతం అవలంబిస్తున్న విద్యావిధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ఇటీవల జైపూర్ పర్యటనకు వెళ్లినపుడు స్పష్టమైందని అన్నారు. సీఈవో శైలేష్ రెడ్డి మాట్లాడుతూ, సేవా ధృక్పథంతో నడుపుతున్న టి-సాట్ ఛానెళ్లు అగ్రభాగాన నిలిచాయంటే అది కేటీఆర్ ఇచ్చిన స్వేచ్ఛ వలనే సాధ్యమైందని, టి-సాట్ ను ఆరో తరగతి విద్యార్థుల నుండి ఉన్నత స్థాయి విద్యనభ్యసించే వారితో పాటు భవిష్యత్ లో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.కాగా, సీఈవో ఆర్.శైలేష్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. విప్లవాత్మక ఆలోచనలతో టి-సాట్ నెట్వర్క్ ఛానెల్స్ నిపుణ - విద్యను ముందుకు నడుపుతున్నారని ప్రశంసించారు. బాధ్యతలు అప్పగించిన తొలినాళ్లలో పోటీ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ మొదటి కార్యక్రమంతో తన వద్దకు వచ్చిన శైలేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపించారని ప్రశంసించారు. ఒకానొక దశలో మనకే ఒక శాటిలైట్ ఉంటే సేవలు మరింత విస్తరించడానికి అవకాశం ఉందన్న శైలేష్ రెడ్డి విప్లవాత్మకమైన ఆలోచన తనను ఆలోచింపచేసిందని అన్నారు. గతంలో నామమాత్రంగా ఉన్న ఈ ప్రభుత్వ చానెల్స్ ను పాధాన్యత క్రమంలోకి చేర్చిన ఘనత శైలేష్ రెడ్డికే దక్కుతుందని అభినందించారు. 

  • Loading...

More Telugu News