honour killing: అనంతపురం జిల్లాలో పరువు హత్య.. 16 ఏళ్ల బాలికను హత్య చేసిన తల్లిదండ్రులు

  • వేరే సామాజికవర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడిన బాలిక
  • కూతురుపై దాడి చేసిన తల్లిదండ్రులు
  • ఆదివారం హెచ్చెల్సీ కాలువలో కనిపించిన బాలిక మృతదేహం

పరువు హత్య అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. వేరే సామాజికవర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడిందన్న కోపంతో కన్నకూతురుని ఆమె తల్లిదండ్రులు చంపేశారు. ఈ ఘటన బుక్కరాయసముద్రం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, చెన్నంపల్లి గ్రామానికి చెందిన బాలిక హేమశ్రీ (16) వేరే సామాజికవర్గానికి చెందిన మోహన్ రాజు (20) అనే యువకుడిని ప్రేమించింది. పది రోజుల క్రితం వీరిద్దరూ తిరుమలకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇటీవలే తన భర్తతో కలసి ఆమె గ్రామానికి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటికి రావాలని కోరారు. ఆమె రానని చెప్పడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూతురుని నడివీధిలో కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి నుంచి బాలిక, ఆమె తల్లిదండ్రులు గ్రామంలో కనిపించలేదు.

ఈ క్రమంలో ఆదివారంనాడు మండల పరిధిలో ఉన్న హెచ్చెల్సీ కాలువలో ఓ బాలిక మృతదేహం లభించింది. దర్యాప్తును చేపట్టిన పోలీసులు ఆ మృతదేహం చెన్నంపల్లికి చెందిన హేమశ్రీదిగా గుర్తించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు ఎర్రమ్మ, నారాయణస్వామితో పాటు ఆమె బాబాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News