Tamilnadu: హిజ్రాగా మారి దోపిడీలు చేస్తున్న హోంగార్డు.. కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు!

  • తమిళనాడులోని కడలూరులో ఘటన
  • స్నేహితులతో కలిసి దోపిడీలు
  • నిందితుడిపై వేటువేసిన పోలీస్ శాఖ

కంచె చేను మేసిన చందంగా ఓ హోంగార్డు తయారయ్యాడు. హిజ్రా వేషం వేసుకుని స్నేహితుడితో కలిసి ప్రజలను, వ్యాపారులను వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా కత్తితో ప్రజలను బెదిరించి దోపిడీలు చేయడం ప్రారంభించాడు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని పళైయ పాలం వద్ద రాజమోహన్ ఈ నెల 25న వాహనంపై వెళుతుండగా ఇద్దరు హిజ్రాలు ఆయన్ను అడ్డగించి కత్తితో బెదిరించారు. ఫోన్, పర్సును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై రాజమోహన్ పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. నిందితులు దోపిడీకి పాల్పడుతున్న మార్గంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న భరత్(26), సురేశ్(20)ను అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరినీ విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిజ్రాలుగా వేషం వేసుకుని ఈ మార్గంలో తాము దోపిడీలకు పాల్పడుతున్నట్లు భరత్, సురేశ్ అంగీకరించారు. గత రెండేళ్లుగా ఇలా దోపిడీలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరిలో భరత్ హోంగార్డుగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ఈ ఘటన తెలుసుకున్న ఉన్నతాధికారులు భరత్ ను విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఇద్దరు దుండగులను కటకటాల వెనక్కునెట్టారు.

  • Loading...

More Telugu News