huzurnagar: నాకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారు.. ఆత్మహత్య చేసుకుంటా: శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

  • నాలుగేళ్లుగా నన్ను జగదీశ్ రెడ్డి వేధిస్తున్నారు
  • ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు
  • జగదీశ్ రెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుంది

తాను బీసీ మహిళను అయినందుకే నాకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. హైదరాబాద్ లోని తెలంగాణభవన్ కు ఈరోజు ఆమె వెళ్లారు.

టీఆర్ఎస్ నుంచి హుజూర్ నగర్ టికెట్ ను ఆశిస్తున్న శంకరమ్మ మాట్లాడుతూ, తనకు టికెట్ రాకుండా జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని, నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆయనపై ఆరోపణలు చేశారు. ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు జగదీశ్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని, ఆయనకు టికెటిస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

జగదీశ్ రెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. వందల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారంటూ జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ లపై తనకు ఎనలేని గౌరవం ఉందని ఈ సందర్భంగా శంకరమ్మ చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News