sarada chitfund case: కోల్ కతా పోలీస్‌ కమిషనర్‌ పై ఆరోపణలకు ఆధారాలు చూపించండి: సీబీఐకి సుప్రీంకోర్టు సూచన

  • అప్పుడే మీరు కోరినట్టు ఆదేశాలు ఇస్తాం
  • తమ అధికారులను బెంగాల్‌ పోలీసులు నిర్బంధించారని పిటిషన్‌

శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో కోల్ కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్ కుమార్ తప్పుచేసినట్లు, సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు ఎటువంటి ఆధారాలు ఉన్నా 24 గంటల్లోగా తమ ముందు ఉంచితే మీరు కోరినట్లు ఆదేశాలు ఇస్తామని దేశ అత్యున్నత న్యాయ స్థానం సీబీఐకి స్పష్టం చేసింది. కమిషనర్ ను విచారించేందుకు ఆదివారం కోల్‌కతా వెళ్లిన సిబీఐ అధికారులను అక్కడి పోలీసులు నిర్బంధించి ఆ తర్వాత విడిచిపెట్టిన విషయం తెలిసిందే.

ఈ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీక్షకు దిగడం, ప్రస్తుతం ఈ వివాదం నడస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అధికారులను పశ్చిమబెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్‌ మెహతా వాదించారు. తమ కార్యాలయాన్ని కూడా అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఎదుట ప్రస్తావించారు.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని న్యాయమూర్తి ప్రశ్నించగా తమ సిబ్బందిని వదిలేసినట్లు తెలిపారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ సిబ్బందిని వదిలేశాక పిటిషన్‌ ను అర్జంటుగా విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇక కోల్ కతా పోలీస్‌ కమిషనర్‌ విషయానికి వస్తే ‘మీ వద్ద ఒక్క ఆధారమైనా చూపించండి, మేము చాలా కఠినంగా స్పందిస్తాం. ఎంత కఠినంగా స్పందిస్తామంటే తామెంత తప్పుచేశామో అని వారు పశ్చాత్తాపపడే అంతగా’ అని గొగోయ్‌ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News