India: భారత విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్!

  • మెరుపుల తాకిడికి లోనైన భారత విమానం
  • విమానాన్ని పాక్ గగనతలంలోకి అనుమతించిన ఏటీసీ
  • సురక్షితంగా గమ్యం చేరిన విమానం

ఆర్థికంగా ఎంతో నష్టదాయకం అని తెలిసి కూడా భారత్ పై అక్కసుతో పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఓ పాకిస్థానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆపదలో ఉన్న భారత విమానం పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జైపూర్ నుంచి ఒమన్ దేశానికి వెళుతున్న ఓ విమానం పాక్ గగనతలం సమీపం నుంచి వెళుతుండగా, మెరుపుల తాకిడికి గురైంది. దాంతో 36 వేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానం కాస్తా ఒక్కసారిగా రెండు వేల అడుగులు కిందికి జారిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే "మేడే మేడే" అంటూ ఎమర్జెన్సీ సందేశం పంపాడు.

ఈ ప్రమాద సంకేతాలను పాకిస్థాన్ లోని ఓ ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించి, సదరు భారత విమానానికి దిశానిర్దేశం చేశారు. ఆ విమానాన్ని పాక్ గగనతలంలోకి అనుమతించడం ద్వారా మెరుపుల ప్రభావం నుంచి రక్షించగలిగారు. తద్వారా ఆ విమానం ముప్పు నుంచి బయటపడి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. కాగా, ఈ విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్ వైమానిక దాడులు నిర్వహించినందుకు బదులుగా పాక్ తన గగనతలాన్ని మూసివేసింది.

  • Loading...

More Telugu News