UK: బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీలు

  • బ్రిటన్ ఎన్నికల్లో 65 మంది శ్వేతజాతీయేతరుల జయకేతనం
  • వారిలో 15 మంది భారతసంతతి సభ్యులు
  • భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి ఎంపీలు

బ్రిటన్ పార్లమెంటుకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి ఎంపీలు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు. తద్వారా బ్రిటన్ పార్లమెంటులో మైనార్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి అల్లుడు రిషి సనక్ కూడా ప్రమాణం చేసే సమయంలో భగవద్గీతను చేతిలో పట్టుకున్నారు. సభ్యులు తమకు నచ్చిన పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసే వెసులుబాటు బ్రిటన్ లో ఉంది.

మరోవైపు, ఈ ఎన్నికల్లో బ్రిటన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 65 మంది శ్వేతజాతీయేతరులు విజయబావుటా ఎగురవేశారు. వీరిలో 15 మంది భారతీయులు కావడం మనకు గర్వకారణం. బ్రిటన్ లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడుతున్న శ్వేతజాతీయేతరుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News