Andhra Pradesh: జనం ముందస్తు కొనుగోళ్లు... తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు కిటకిట!

super croud in telugu states rythu bajars

  • అన్ని నగరాల్లోనూ ఒకేటే పరిస్థితి
  • ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌
  • ధరలు భారీగా పెంచేసిన దళారులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనం ముందస్తు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో అన్ని రైతు బజార్లు ఈరోజు ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, ఖమ్మం, వరంగల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని రైతు బజార్లలో ఒకే తరహా పరిస్థితి దర్శనమిచ్చింది. దాదాపు వారంపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుండడంతో కూరగాయలు, ముఖ్యమైన నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు తీరారు.

ముఖ్యంగా సరుకులు లభించవేమోనన్న ఆందోళనతోపాటు ధరలు పెంచేస్తారేమోనన్న భయంతో చాలామంది ఉదయాన్నే మార్కెట్‌ బాటపట్టారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. ఇదే అదనుగా దళారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం పదిరూపాయల కంటే తక్కువ ఉన్న టమాటా ధర ఏకంగా నలభై రూపాయలకు పెంచేశారు.

ఉల్లి ధర రెట్టింపు చేసి అమ్ముతున్నారు. అయితే డిమాండ్‌ మేరకు సరుకు అందుబాటులో లేకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు సమర్థించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News