Inmates: కరోనా భయంతో ఖైదీల తిరుగుబాటు.. కొలంబియాలో 23 మంది ఖైదీల మృతి

23 Inmates dead after protest over virus fears in Colombia
  • జైలులో అపరిశుభ్రత వల్ల కరోనా వస్తుందని భయం
  • తప్పించుకునే ప్రయత్నంలో విధ్వంసం
  • మరో 83 మందికి గాయాలు
కరోనా వైరస్ జైల్లోని ఖైదీలను కూడా భయపెడుతోంది. జైల్లోని అపరిశుభ్ర వాతావరణం వల్ల కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని, అందుకని ఇక్కడ తాము ఉండలేమంటూ కొలంబియా రాజధాని బొగొటా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించి జైలులో విధ్వంసం సృష్టించారు. జైలు సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో జైలులో యుద్ధ వాతారణం నెలకొంది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఖైదీలు, జైలు సిబ్బంది కూడా ఉన్నారు.

ఈ ఘటనపై ఆ దేశ న్యాయశాఖ మంత్రి మార్గరెటా క్యాబెల్లో ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదని, అపరిశుభ్ర వాతావరణం వల్ల వైరస్ వస్తుందన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. దేశంలోని జైళ్లలో జరుగుతున్న అల్లర్ల వెనుక కుట్ర దాగి వుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జైళ్ల నుంచి పారిపోయేందుకే ఖైదీలు ఇలా ప్రవర్తిస్తున్నట్టు తెలిపారు. అయితే, తాజా ఘటనలో ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేదని మంత్రి వివరించారు. కాగా, నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు 231 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
Inmates
colombia
jail
Corona Virus

More Telugu News