Rajasthan: కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం: రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా

Congress Allegations ridiculous says Rajasthan BJP Chief Satish Poonia

  • రాజకీయ సంక్షోభానికి బీజేపీ కారణమన్న గెహ్లాట్
  • కాంగ్రెస్ కలహాల్లో జోక్యం చేసుకోబోమన్న పూనియా
  • సచిన్ ఎత్తుగడపై సర్వత్ర ఆసక్తి

తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ రాజస్థాన్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా తోసిపుచ్చారు. కాంగ్రెస్ కలహాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్న ఆయన తాము ఇప్పటి వరకు బలపరీక్షకు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.

మరోవైపు, రాష్ట్రంలోని సంక్షోభానికి బీజేపీయే కారణమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా కొనేందుకు ప్రయత్నిస్తోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 30 కోట్లు ఆఫర్ చేస్తోందని ఆరోపించారు.  

కాగా, నేడు జరిగిన సీఎల్పీ సమావేశానికి కూడా అసంతృప్త నేత సచిన్ పైలట్ గైర్హాజరు కావడంతో రాజస్థాన్ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేసిన పైలట్.. బీజేపీలో చేరబోనని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయనేం చేయబోతున్నారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

  • Loading...

More Telugu News