Online games: ఆన్‌లైన్ గేములను ప్రచారం చేస్తున్న కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయండి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్

Petition filed seeking Virat Kohli and Tamannaah arrest for promoting online gambling

  • ఆన్‌లైన్‌ గేములను ప్రచారం చేస్తూ యువత మరణానికి కారణం అవుతున్నారు
  • గ్యాంబ్లింగ్ మహమ్మారి సమాజానికి ప్రమాదకరం
  • గ్యాంబ్లింగ్ బారినపడి ఇటీవల 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ పలువురి మరణాలకు కారణమవుతున్నారంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి తమన్నాలకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళనాడుకు చెందిన న్యాయవాది సూర్యప్రకాశం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ గేములు ఆడి నష్టపోతున్న వారు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, కాబట్టి ఈ గేములకు ప్రచారకర్తలుగా ఉన్న కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

గ్యాంబ్లింగ్ మహమ్మారి సమాజానికి చాలా ప్రమాదకరమని, ఇది జీవించే హక్కును కాలరాస్తోందని, రాజ్యాంగంలోని 21వ అధికరణకు ఇది విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత ఈ వ్యసనం బారినపడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోహ్లీ, తమన్నాతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ గేములను ప్రచారం చేస్తున్నారని వివరించారు. చెన్నైకి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని, గ్యాంబ్లింగ్‌కు బానిస కావడం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్‌లో రాశాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి ఆయా సైట్ల నిర్వాహకులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని న్యాయవాది సూర్యప్రకాశం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, వచ్చేవారం కోర్టు ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News