Third quarter: నేటి నుంచి మూడో త్రైమాసికం ప్రారంభం.. పలు రంగాల్లో అమల్లోకి కొత్త నిబంధనలు

Third quarter starts today no driving licence hard copy needed
  • డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు
  • బీమా పథకాల్లో కరోనాకూ చికిత్స
  • ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలెండర్ కనెక్షన్ ఉచితం
ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా నేటి నుంచి మూడో త్రైమాసికం ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు రంగాల్లో సరికొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా మోటారు వాహనాలు, ఆహారం, ఆరోగ్య సేవలు, బ్యాంకులో కనీస నిల్వ, డిజిటల్ చెల్లింపులు తదితర రంగాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా తదితర పత్రాలను ఇప్పటి వరకు వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. అయితే, నేటి నుంచి మాత్రం ఆ అవసరం లేదు. ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న డిజిలాకర్, ఎం-పరివాహన్ యాప్‌లలో ఆయా పత్రాల సాఫ్ట్ కాపీలను చూపిస్తే సరిపోతుంది.

అలాగే, స్వీటు షాపుల్లో విడిగా బాక్సుల్లో విక్రయించే మిఠాయిలపై ‘బెస్ట్ బిఫోర్ యూజ్’ తేదీని తప్పనిసరిగా ముద్రించాలి. వివిధ పదార్థాల తయారీలో ఉపయోగించే ఆవనూనెను ఇతర నూనెలతో కలపడం పూర్తిగా నిషేధం. ఇకపై కరోనా చికిత్సను కూడా ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చబోతున్నారు. ఆరోగ్య సేవలు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లో కనీస నిల్వ మెట్రో నగరాల్లో రూ. 5 వేల నుంచి రూ. 3 వేలకు తగ్గనుంది. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలెండర్ కనెక్షన్ ఉచితంగా లభించనుంది. ఇక, డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులు స్వచ్ఛందంగా పరిమితులు విధించుకోవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో నేవిగేషన్ కోసం మొబైల్ ఉపయోగించుకోవచ్చు.
Third quarter
driving licence
SBI
Corona Virus
Health schemes

More Telugu News