KTR: ప్రజలకు మంచి చేస్తున్నందుకా మాపై చార్జిషీట్ వేశారు?: కేటీఆర్ ఆగ్రహం

KTR questions why BJP and Jawadekar released a charge sheet
  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై జవదేకర్ చార్జిషీట్
  • ఎన్డీయేపై 132 కోట్ల చార్జిషీట్లు వేయొచ్చన్న కేటీఆర్
  • జెహ్రాన్ నగర్ లో భారీ రోడ్ షో
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం కత్తులు దూస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చేస్తూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చార్జిషీట్ పేరిట ఓ జాబితా విడుదల చేశారు. దీనిపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

"మాపై బీజేపీ, ప్రకాశ్ జవదేవకర్ ఎందుకు చార్జిషీట్ విడుదల చేశారు? పేదల కడుపునింపే అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించినందుకా? నగరంలో ఎల్ఈడీ లైట్లు అమర్చినందుకా? హైదరాబాదులో శాంతిని నెలకొల్పినందుకా? లేకపోతే, కొత్త పెట్టుబడులు తీసుకువస్తున్నందుకా?" అంటూ నిప్పులు చెరిగారు.

ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వంపైనే చార్జిషీట్లు నమోదు చేయాల్సి వస్తే... ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న ఒక్క హామీపైనే 132 కోట్ల చార్జిషీట్లు వేయొచ్చని కేటీఆర్ విమర్శించారు. బంజారాహిల్స్ లోని జెహ్రాన్ నగర్ లో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR
Charge Sheet
Prakash Javadekar
BJP
Hyderabad
GHMC Elections

More Telugu News