Krishna District: బ్యాంకుల ఎదుట చెత్త.. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు

Vuyyuru municipal commissioner suspended

  • బ్యాంకుల ఎదుట చెత్త వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
  • క్షమాపణ చెప్పిన కాసేపటికే సస్పెన్షన్ ఉత్తర్వులు
  • మచిలీపట్నం, విజయవాలోనూ ఇలాంటి తరహా ఘటనలు

బ్యాంకుల ఎదుట చెత్తవేసిన ఘటనలో కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్‌రావు క్షమాపణ చెప్పిన కొన్ని నిమిషాలకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. బ్యాంకుల ఎదుట చెత్త వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకాశ్‌రావును సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

అంతకుముందు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది, లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ఎదుట చెత్త వేయడం బాధకరమని అన్నారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు గాయపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. చెత్త వేసిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

 కాగా, మచిలీపట్నం, విజయవాడలోనూ ఇలాంటి ఘటనలే జరిగినట్టు వార్తలు రావడంతో ఆయా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం వివరణ కోరింది. కాగా, రుణాలు ఇవ్వడం లేదన్న కారణంతో కృష్ణా జిల్లాలోని పలు బ్యాంకుల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చెత్త పోసి నిరసన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

  • Loading...

More Telugu News