Wriddhiman Saha: సన్ రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా... ఐపీఎల్ పై నేడు నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ!

Sunrisers Hyderabad player Wriddhiman Saha tested corona positive

  • ఐపీఎల్ లో కరోనా కలకలం
  • ఇప్పటికే కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా
  • నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా
  • ఇవాళ సన్ రైజర్స్, ముంబయి మధ్య మ్యాచ్
  • ఐపీఎల్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ
  • నేడు ప్రత్యేక సమావేశం

ఐపీఎల్ లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో, ఇవాళ సన్ రైజర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై అనుమాన మేఘాలు అలముకున్నాయి.

అటు, చెన్నై జట్టులోనూ కరోనా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో లీగ్ కొనసాగడంపై అనిశ్చితి నెలకొంది. నిన్న కేకేఆర్ ఆటగాళ్లకు పాజిటివ్ రాగానే, సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు వరుసగా కేసులు వస్తుండడంతో ఐపీఎల్ ను నిలిపివేసే అవకాశాలున్నాయి. తాజా పరిణామాలపై చర్చించేందుకు బీసీసీఐ నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఐపీఎల్ కొనసాగింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే లీగ్ ను రద్దు చేయకుండా, రీషెడ్యూల్ చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత ఐపీఎల్ 14వ సీజన్ ను కొనసాగించాలన్నది బోర్డు ఆలోచనగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం... ఢిల్లీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లీగ్ కొనసాగించడం కష్టమే!

  • Loading...

More Telugu News