Andhra Pradesh: న్యాయమూర్తులను దూషించిన కేసులో నిందితుడు రాజశేఖరరెడ్డికి రెండు రోజుల సీబీఐ కస్టడీ

Rajasekhara Reddy remanded in CBI custody for two more days
  • న్యాయమూర్తులపై దూషణల కేసులో 15వ నిందితుడిగా రాజశేఖరరెడ్డి
  • విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని ఆదేశం
  • నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలన్న న్యాయస్థానం
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని కోర్టు రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు గుంటూరు నాలుగో అదనపు జూనియర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన కేసులో రాజశేఖరరెడ్డి 15వ నిందితుడిగా ఉన్నాడు.

 ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు తొలుత స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టగా, ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును స్వీకరించింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. నిందితుడిని లోతుగా విచారించాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిని విచారించిన కోర్టు రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్.అరుణశ్రీ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, విచారణ సమయంలో అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, నిందితుడు కోరితే కనుక న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు.
Andhra Pradesh
Judges
Social Media
CBI

More Telugu News