Cash For Vote: ఓటుకు నోటు కేసులో ఆగస్టు 13 వరకు సాక్షుల విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు

ACB Court conduct hearing on cash for vote case

  • గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
  • సాక్షులను త్వరగా విచారించాలన్న ఏసీబీ అధికారులు
  • సుప్రీం, హైకోర్టు ఆదేశాల ప్రస్తావన
  • వాదనలు వినిపించిన రేవంత్, సెబాస్టియన్

తెలుగు రాష్ట్రాలను గతంలో కుదిపేసిన ఓటుకు నోటు కేసులో భాగంగా నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. సాక్షుల విచారణ వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో త్వరగా విచారణ పూర్తిచేయాలని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అందుకే రాజకీయ నేతలు నిందితులుగా ఉన్న ఈ ఓటుకు నోటు కేసులో త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి స్పందిస్తూ వారంలో 2 రోజులే సాక్షుల విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మరో నిందితుడు సెబాస్టియన్ స్పందిస్తూ, సాక్షుల విచారణ వారానికోసారి జరపాలని విన్నవించారు. కరోనా బారినపడ్డానని, రోజువారీ విచారణ తనకు ఇబ్బందికరంగా ఉందని సెబాస్టియన్ వెల్లడించారు. వాదనల అనంతరం, ఈ నెల 26 నుంచి ఆగస్టు 23 వరకు సాక్షులను విచారిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News