CPI Narayana: రాష్ట్రపతిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలవడానికి కారణం ఇదే: సీపీఐ నారాయణ

This is the reason why CJI NV Ramana met the President of India Kovind says CPI Narayana

  • నేర చరిత్ర కలిగిన నేతలపై లోతైన విచారణ జరపాలనే పట్టుదలతో జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారు
  • ఇది కేంద్రం, రాష్ట్రాల్లోని నేతలకు ఇష్టం లేదు
  • అందుకే మద్దతు కోసం రాష్ట్రపతిని సీజేఐ కలిశారు

రాజకీయ నాయకుల క్రిమినల్ రికార్డులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోగానే ఆ వ్యక్తి క్రిమినల్ రికార్డును ఆయా పార్టీలు బయటపెట్టాలని ఆదేశించింది. ఇదే సమయంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కలిశారు.

ఈ భేటీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టడం రాజకీయ నాయకులకు ఇష్టం లేదని అన్నారు. అందుకే రాష్ట్రపతిని సీజేఐ ఎన్వీ రమణ కలిసుంటారని చెప్పారు. రాష్ట్రపతిని చీఫ్ జస్టిస్ కలవడం శుభపరిణామమని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ లో ఉన్న 33 మందికి నేర చరిత్ర ఉందని నారాయణ ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన నేతలపై లోతుగా విచారణ జరపాలనే పట్టుదలతో జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారని... అయితే అది కేంద్రం, రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు ఇష్టం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసి సీజేఐ మద్దతు కోరినట్టు తెలుస్తోందని చెప్పారు.

ఇదిలావుంచితే, ముఖ్యమంత్రి జగన్ తన ఎంపీలతో కలిసి ధర్నాకు దిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని నారాయణ అన్నారు. కానీ ఆ పని జగన్ చేయలేడని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో అత్యంత పవిత్రమైన పార్లమెంటులో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్చింది కన్నీళ్లు కాదని, అది రైతుల రక్తమని విమర్శించారు. రైతుల సమస్యలు, చావులపై చర్చించే అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వలేదని అన్నారు.

  • Loading...

More Telugu News