Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవిగో!

Huzurabad By Elections Exit Polls

  • ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
  • ఈటల వైపే మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్
  • ఈటలకు 50 శాతం పైగా ఓట్లు వచ్చాయంటున్న సర్వే సంస్థలు
  • రెండోస్థానంలో టీఆర్ఎస్ అని వెల్లడి

హుజూరాబాద్ (తెలంగాణ), బద్వేలు (ఏపీ) అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది.

హుజూరాబాద్ విషయానికొస్తే మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కే మొగ్గు ఉన్నట్టు ఆత్మసాక్షి గ్రూప్ పేర్కొంది. అయితే ఈటల స్వల్ప తేడాతోనే గెలుస్తారని, భారీ విజయం దక్కకపోవచ్చని అంచనా వేసింది. ఈటలకు 50.5 శాతం ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 43.1 శాతం ఓట్లు అంటూ తన అంచనాలు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి ఓట్ల శాతం 5.7 మాత్రమేనని ఆత్మసాక్షి పేర్కొంది. ఈటల రాజేందర్ పై సానుభూతి అంశం ఓటర్లను బాగా ప్రభావితం చేసిందని వెల్లడించింది.

కౌటిల్య సొల్యూషన్స్ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ 47 శాతం, టీఆర్ఎస్ 40 శాతం, కాంగ్రెస్ 8 శాతం ఓట్లు సంపాదిస్తాయని వెల్లడైంది.

పోల్ ల్యాబొరేటరీ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే.... హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఈటల రాజేందర్ 23 వేల ఓట్ల తేడాతో నెగ్గబోతున్నారని తెలిపింది. ఈటలకు 51 శాతం, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 42 శాతం, కాంగ్రెస్ అభ్యర్థికి 3 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వివరించింది.

ఇక ఏపీలో బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీదే విజయం అని... బీజేపీ, కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలో నిలపడంతో వైసీపీ గెలుపు మార్జిన్ భారీగా ఉండనుందని అంచనాలు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News