Meghalaya: మేఘాలయలో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్.. టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు జంప్

 Meghalaya Former CM Mukul Sangma Joins TMC With 11 MLAs

  • మేఘాలయలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
  • రాత్రికి రాత్రే 12 ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరడంతో ప్రతిపక్షహోదా
  • నేడు మేఘాలయకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మనీష్ చత్రత్

కాంగ్రెస్ పార్టీకి వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొరొక్కరుగా టీఎంసీలోకి జారుకుంటున్నారు. తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. రాష్ట్రంలో పార్టీకి ఉన్న 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది నిన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉండడం గమనార్హం.

మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా, 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు మిగలగా, 12 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే టీఎంసీలో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్ తీరుపై ముకుల్ సంగ్మా గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే ఆయన  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టీఎంసీలోకి ఇటీవల వలసలు బాగా పెరిగాయి. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన మమత.. ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని భావిస్తున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న లుజినో ఫలైరో సెప్టెంబరులో టీఎంసీలో చేరారు. టెన్నిస్ డబుల్స్ మాజీ స్టార్ లియాండర్ పేస్, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్, రాహుల్ గాంధీతో ఒక్కప్పుడు సన్నిహితంగా మెలిగిన అశోక్ తన్వర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇటీవల టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.

మేఘాలయలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టీఎంసీలో చేరడంతో అప్రమత్తమైన ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మనీష్ చత్రత్ నేడు మేఘాలయ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన నేడు గుజరాత్ వెళ్లి కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని మేఘాలయ వెళ్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News