Narendra Modi: ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన భూటాన్.. ఈ పురస్కారాన్ని అందుకోనున్న తొలి విదేశీయుడు మోదీనే!

PM Narendra Modi conferred Bhutans highest civilian honour

  • తమకు మోదీ అందిస్తున్న సాయం వెలకట్టలేనిదన్న భూటాన్
  • కరోనా సమయంలో ఎంతో చేశారని కితాబు
  • ఈ పురస్కారానికి మోదీ అత్యంత అర్హులని వ్యాఖ్య

భారత ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'న్గడగ్ పేల్ గి ఖోర్లో'ను మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది.

భూటాన్ కు అన్ని విధాలుగా, అన్ని సమయాల్లో ప్రధాని మోదీ అందిస్తున్న సాయాన్ని తమ రాజు ప్రధానంగా ప్రస్తావించారని పేర్కొంది. భూటాన్ కు కొన్నేళ్లుగా మోదీ ఎంతో సాయం చేశారని... ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మోదీ అందించిన స్నేహహస్తం వెలకట్టలేనిదని కొనియాడింది.

తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి మోదీ అత్యంత అర్హులని చెప్పింది. తమ దేశ ప్రజలందరి తరపున మోదీకి శుభాకాంక్షలు చెపుతున్నామని తెలిపింది. ఒక గొప్ప నేత, గొప్ప ఆధ్యాత్మికవేత్త మోదీ అని కొనియాడింది. మోదీకి పురస్కారాన్ని అందించేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపింది.

2008లో ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని భూటాన్ నెలకొల్పింది. ఇంత వరకు ఏ విదేశీయుడికి ఈ పురస్కారాన్ని భూటాన్ ఇవ్వలేదు. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి విదేశీయుడు మోదీ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News