Prashant Kishor: 2024 ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపడం సాధ్యమే: ప్రశాంత్ కిశోర్

Can defeat bjp if form strong opposition said Prashant Kishor
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అందుకు పనిలేదు
  • బీజేపీని ఓడించాలంటే తొలుత కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలి
  • బీజేపీ నినాదాల్లో రెండింటిని అయినా అధిగమించాలి
  • తగిన ప్రతిపక్షం ఏర్పాటులో సాయపడతా
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఇంటికి పంపడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా రాకపోయినా సరే 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం సాధ్యమయ్యే పనేనని అన్నారు. నిన్న జాతీయ న్యూస్ చానల్ ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీని ఓడించడం అయ్యేపనేనన్న ప్రశాంత్ కిశోర్.. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షంతో మాత్రం అది సాధ్యం కాదన్నారు. బీజేపీ హిందూత్వ నినాదం, జాతీయ భావానికి తోడు సంక్షేమ పథకాలతో ఎన్నికలకు వెళ్తోందని, వీటిలో రెండింటిని అయినా ప్రతిపక్షాలు అధిగమించాల్సి ఉంటుందని పీకే అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రతిపక్షం సాధ్యం కాదన్న ఆయన.. బీజేపీని ఓడించేందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటులో తాను సాయపడతానన్నారు. అయితే, కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప కమలదళాన్ని ఓడించడం సాధ్యం కాదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
Prashant Kishor
BJP
Congress

More Telugu News