Yogi Adityanath: నచ్చింది ధరించొచ్చు.. అన్ని చోట్లా కాదు.. అధికారులపై డ్రెస్ కోడ్ రుద్దబోను: ఆదిత్యనాథ్

No woman wears hijab by choice Yogi Adityanath

  • వస్త్రధారణలో స్వేచ్ఛ ఇళ్లు, మార్కెట్లకు పరిమితం
  • సంస్థల్లో నిబంధనల మేరకు నడుచుకోవాలి
  • హిజాబ్ బలవంతపు ఆచారం
  • మహిళలు ఇష్ట ప్రకారం వేసుకోవడం లేదన్న యోగి 

దేశవ్యాప్తంగా హిజాబ్ (ముస్లిం మహిళలు ముఖం కనిపించకుండా ధరించే వస్త్రం) గురించి చర్చ నడుస్తున్న సందర్భంలో.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై స్పందించారు. తన అధికారులపై డ్రెస్ కోడ్ అమలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే తనకు ఇదే తరహా (కాషాయం) వస్త్రాలు ధరించడమే ఇష్టమని చెప్పారు.

‘‘ప్రతీ వ్యక్తి తాను కోరుకున్నది ధరించొచ్చు. కానీ, ఆ స్వేచ్ఛ బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, ఇళ్లకే పరిమితం. కానీ, ఎవరిపైనా డ్రెస్ కోడు రుద్దబోము. ప్రతీ సంస్థ యూనిఫామ్ నిబంధనను అనుసరించాలి. ఒకవేళ పోలీసుమ్యాన్ తాను ఒక మతానికి చెందిన వ్యక్తినని, ఆ మత సంప్రదాయాలకు తగ్గ వస్త్రాలు ధరిస్తానంటే గందరగోళానికి దారితీస్తుంది’’ అని ఆదిత్యనాథ్ చెప్పారు.
 
ముస్లిం మహిళలపై హిజాబ్ బలవంతంగా రుద్దిన ఆచారమే కానీ, వారు తమ ఇష్టానుసారం ధరిస్తున్నది కాదని ఆదిత్యనాథ్ అన్నారు. ‘‘ఏ మహిళ కూడా హిజాబ్ ను తన ఇష్ట ప్రకారం ధరించదు. ట్రిపుల్ తలాఖ్ అనే దుష్ట సంప్రదాయాన్ని మహిళలు ఎప్పుడైనా ఆమోదించారా? కూతుర్లు, సోదరీమణులను ప్రశ్నించండి. దీని గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో నేను వారి కళ్లలో నీళ్లు చూశాను’’ అని ఆదిత్యనాథ్ వివరించారు.

  • Loading...

More Telugu News