BJYM: ఆ వార్తలు అవాస్తవం.. బీజేపీ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై రాహుల్ ద్రవిడ్

Incorrect Rahul Dravid On Report Claiming He will Attend BJP Event
  • ధర్మశాలలో ఈ నెల 12 నుంచి 15 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ సదస్సు
  • ద్రవిడ్ హాజరై యువతకు సందేశమిస్తారన్న ధర్మాశాల బీజేపీ ఎమ్మెల్యే
  • ఆ వార్తలను కొట్టిపడేసిన ద్రవిడ్
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 12-15 మధ్య జరగనున్న బీజేపీ యువ మోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సదస్సుకు తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, తాను ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టతనిచ్చాడు. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పాడు. 

ధర్మశాల సదస్సుకు రాహుల్ ద్రవిడ్ వస్తున్నారంటూ బీజేపీ ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా ఇటీవల తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరవుతారని, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై యువతకు సందేశం ఇస్తారని అన్నారు. ద్రవిడ్ పాల్గొంటున్నట్టు మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో స్పందించిన మాజీ క్రికెటర్.. ఆ వార్తలను కొట్టిపడేశాడు.

ఇదిలావుంచితే, హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017 ఎన్నికల్లో 68 స్థానాలకు గాను బీజేపీ 44 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌కు 21 స్థానాలు లభించాయి. ఇతరులకు మూడు సీట్లు లభించాయి.
BJYM
BJP
Rahul Dravid
Dharmashala
Vishal Nehria

More Telugu News