Hardik Pandya: జట్టులో చోటుకు నేను చేసిన త్యాగాలు ఎవరికీ తెలియవు: హార్థిక్ పాండ్యా

Hardik Pandya on comeback road Woke up at 5 am every day no one knows the sacrifices I made

  • రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచే వాడినన్న పాండ్యా 
  • రోజంతా సాధనలోనే మునిగిపోయేవాడినని వెల్లడి
  • ఫలితాలను చూసి సంతృప్తి చెందానన్న గుజరాత్ కెప్టెన్

వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం తెలిసిందే. ఆల్ రౌండర్ గా తాను రాణించడమే కాకుండా, జట్టు మొత్తాన్ని సమష్టిగా నడిపించి, టైటిల్ సాధించాడు. 

దీంతో హార్థిక పాండ్యాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అతడు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఇక తన పనితీరు సరిగా లేనప్పుడు తన గురించి ఎంతో మంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. ఆ విమర్శలను తాను పట్టించుకోలేదని పాండ్యా అన్నాడు. కష్టపడి పనిచేయడంపై దృష్టి సారించడం వల్లే మళ్లీ బలంగా తిరిగి రాగలిగినట్టు వివరించాడు. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత పాండ్యా తిరిగి భారత జట్టుకు ఆడలేదు. 

‘‘ఆరు నెలల పాటు నేను ఎంత కష్టపడ్డానన్నది ఎవరికీ తెలియదు. ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఎంతో సాధన చేశాను. నాలుగు నెలల పాటు రోజూ రాత్రి 9.30 గంటలకు నిద్రించాను. ఎన్నో త్యాగాలు చేశాను.  ఐపీఎల్ ఆడడానికి ముందు అది నాకు ఓ పోరాటమే. ఫలితాల పట్ల సంతృప్తిగా ఉంది. నేను ఎంత కష్టపడ్డానన్నది నాకు తెలుసు. నా జీవితంలో కష్టపడి పనిచేయడమే కానీ ఫలితాల గురించి ఆందోళన చెందను. అందుకే ఎప్పుడైనా నేను అసాధారణ ప్రదర్శన చేసినప్పుడు పొంగిపోను’’ అని పాండ్యా తన మనోగతాన్ని వివరించాడు.

  • Loading...

More Telugu News