Anthrax: కేరళలో ఆంథ్రాక్స్ కేసులు.. వరుసగా అడవి పందుల మృతి.. మనుషులకు సోకకుండా చర్యలు

anthrax outbreak in kerala forest

  • అత్తిరప్పిళ్లి ప్రాంతంలో ఆంథ్రాక్స్ వ్యాప్తి
  • ప్రస్తుతానికి ఆందోళన అనవసరమన్న అధికారులు
  • ఆయా ప్రాంతాల్లో పశువులకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ఏర్పాట్లు

కేరళలో మరో అంటు వ్యాధి కలకలం రేపుతోంది. తరచూ ఏదో ఒక ప్రమాదకర వైరస్ బయటపడుతూ ఆగమాగమయ్యే కేరళలో ఈసారి ఆంథ్రాక్స్ వెలుగు చూసింది. కేరళలోని అత్తిరప్పిళ్లి అటవీ ప్రాంతంలో ఇటీవల వరుసగా అడవి పందులు చనిపోతున్నట్టు అధికారులు గుర్తించారు. దానికి కారణమేంటన్న అనుమానంతో శాంపిల్స్ ను తీసి పరీక్షలకు పంపారు. అవన్నీ ఆంథ్రాక్స్ తో చనిపోయినట్టు నివేదికల్లో తేలింది. అయితే ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు.

మనుషులకు సోకకుండా పశువులకు వ్యాక్సినేషన్..
వరుసగా అడవి పందులు ఆంథ్రాక్స్ బారిన పడి చనిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వైరస్ ఇతర పశువులకు, వాటి నుంచి మనుషులకు విస్తరించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆంథ్రాక్స్ కేసులు బయటపడిన ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులకు ‘ఆంథ్రాక్స్’ వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించారు. 

ఏమిటీ ఆంథ్రాక్స్ వ్యాధి..
బాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా సోకడం వల్ల ఆంథ్రాక్స్ వ్యాధి వస్తుంది. సాధారణంగా మేకలు, గేదెలు, ఆవులు వంటి పెంపుడు జంతువులతోపాటు అడవి జంతువులకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన మాంసాన్ని తాకడం, తినడం వల్ల మనుషులకూ సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ఆంథ్రాక్స్ సోకిన వారిలో తీవ్ర జ్వరం, చర్మంపై పుండ్లు, ఊపిరితీసుకోవడంలో సమస్యలు, జలుబు, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. తగిన యాంటీ బయాటిక్స్ వినియోగిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

  • Loading...

More Telugu News