NEET: లో దుస్తులు విప్పించిన బాలికలకు మళ్లీ నీట్ పరీక్ష

NEET frisking row Girls forced to remove underwear allowed to retake exam
  • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం
  • సెప్టెంబర్ 4న తిరిగి పరీక్ష
  • కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగిన ఘటన
కేరళలోని కొల్లాం జిల్లాలో నీట్ పరీక్ష సందర్భంగా అవమానానికి గురైన విద్యార్థినులకు న్యాయం జరిగింది. పరీక్ష రాయాలంటే లో దుస్తులు తీసేసి వెళ్లాల్సిందేనంటూ ఓ పరీక్షా కేంద్రం హుకుం జారీ చేయడం, చేసేదేమీ లేక బాలికలు లోదుస్తులు తీసేసి వెళ్లడం తెలిసిందే. ఈ విషయం ఓ బాధిత విద్యార్థిని తండ్రి ద్వారా అప్పట్లో వెలుగు చూసింది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది.

నాడు లోదుస్తులు విప్పించడం కారణంగా పరీక్ష రాయలేకపోయిన విద్యార్థినులకు (అందరికీ) మరో అవకాశం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. సెప్టెంబర్ 4న వారికి పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. చాతమంగళంలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రాలు తీసి వెళ్లాలంటూ తన కూతురు సహా మహిళా విద్యార్థులను ఆదేశించారంటూ ఓ వ్యక్తి కొట్టకర పోలీసులకు ఈ ఏడాది జులైలో ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరీక్ష జరిగిన కళాశాల సిబ్బంది ఇద్దరు సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై చర్యలకు జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చాయి. ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 

NEET
national testing agency
kerala
kollam
girls
underwear
remove
reexam

More Telugu News