GVL Narasimha Rao: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే: జీవీఎల్

GVL questions CM Jagan explanation on state financial position

  • ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందన్న సీఎం జగన్
  • దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని స్పష్టీకరణ
  • కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్న జీవీఎల్
  • ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుందని వ్యాఖ్య 

ఏపీ ఆర్థిక పరిస్థితిపై విపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదంటూ, సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని గణాంకాల సహితంగా వివరించారు. కేంద్రంతో పోల్చితే ఏపీ అప్పులే తక్కువగా ఉన్నాయని, ఆ అప్పులు కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా చేశారని సీఎం జగన్ సభా సమావేశాల్లో తెలిపారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఆర్థిక పరిస్థితి అంత భేషుగ్గా ఉంటే రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పతనావస్థకు చేరుకుందని, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని జీవీఎల్ విమర్శించారు. ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉంటే, కేంద్ర పథకాలను రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన చేయాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయడంలేదని నిలదీశారు. 

ఇక, రాజధాని అంశంపైనా జీవీఎల్ స్పందించారు. మూడు భవనాలు నిర్మించలేని రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. రాజధాని అంశంలో న్యాయపరంగా ఎదుర్కోలేమని గుర్తించి, ప్రజలను మభ్యపెట్టేందుకు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News