Chief Justice: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్

Chief Justice UU Lalit set to recommend Justice DY Chandrachud as his successor

  • సిఫారసు లేఖను అందజేసిన చీఫ్ జస్టిస్ యూయూ లలిత్
  • కేంద్రానికి నేడు లేఖ
  • నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్.. తన తర్వాత ఆ పదవికి అర్హులైన న్యాయమూర్తిని సూచించాల్సి ఉంది. తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తూ, ఇందుకు సంబంధించిన సిఫారసు లేఖను జస్టిస్ డీవై చంద్రచూడ్ కు మంగళవారం ఉదయం జస్టిస్ యూయూ లలిత్ అందజేశారు. సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల సమక్షంలో ఇది జరిగింది. ఇదే విషయమై జస్టిస్ లలిత్, కేంద్ర న్యాయశాఖకు ఈ రోజు లేఖ రాయనున్నారు. 

జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి ఆ బాధ్యతలకు తగిన వ్యక్తిని సూచించాలని గత వారమే కేంద్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ ఏడాది ఆగస్ట్ లో జస్టిస్ రమణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను లలిత్ చేపట్టడం తెలిసిందే. జస్టిస్ లలిత్ మొత్తం 74 రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు.

సాధారణంగా ప్రధాన న్యాయమూర్తి, తన తదుపరి అత్యంత సీనియర్ అయిన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ పదవికి సిఫారసు చేయడం సంప్రదాయంగా వస్తోంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.

  • Loading...

More Telugu News