MLAs Poaching Case: సీబీఐ దర్యాప్తు అక్కర్లేదు, సిట్ దర్యాప్తు చాలు... ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు

telangana high court rejects cbi enquiry on mlas poaching case

  • సీబీఐ దర్యాప్తును కోరుతూ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్
  • ఈ నెల 29లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ కు ఆదేశం
  • దర్యాప్తు పూర్తయ్యేదాకా వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించాలని సూచన

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసుపై సీబీఐ లేదంటే... సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేత దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే సిట్ దర్యాప్తుపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే దాకా కేసు వివరాలు ఏమాత్రం బయటక పొక్కకుండా జాగ్రత్త వహించాలని సిట్ కు సూచించింది. మీడియాకు గానీ, రాజకీయ నాయకులకు గానీ, ఇతరత్రా ఏ విభాగాలకు కూడా కేసు దర్యాప్తు వివరాలు లీక్ కాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేసు దర్యాప్తు పూర్తి కాగానే... నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని కూడా హైకోర్టు సిట్ ను ఆదేశించింది. దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలని తెలిపింది. ఇక కేసు దర్యాప్తును ఈ నెల 29లోగా పూర్తి చేయాలని కూడా సిట్ కు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News