Bengaluru: కాలేజ్ ఫెస్ట్ లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఇద్దరు విద్యార్థులపై కేసు

2 students in Bengaluru booked for shouting Pakistan zindabad slogans at college fest

  • బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన
  • ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ లో తమ అభిమాన ఐపీఎల్ జట్లకు మద్దతుగా నినాదాలు చేసిన విద్యార్థులు
  • ఇదే సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అన్న ఇద్దరు మైనర్లు

బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసిన ఇద్దరు విద్యార్థులపై పోలీసు కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్ కాలేజీ ఫెస్ట్‌లో విద్యార్థులు తమ అభిమాన ఐపీఎల్ క్రికెట్ జట్ల నినాదాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. అదే సమయంలో మైనర్లు అయిన ఒక అబ్బాయి, అమ్మాయి 'పాకిస్థాన్ జిందాబాద్' అని అరిచారు. దాంతో, ఇతర విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేసి వారిని ఆపడానికి ప్రయత్నించారు.

దీన్ని మరో విద్యార్థి వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో కళాశాల విచారణ చేపట్టి ఇద్దరి నుంచి క్షమాపణ లేఖలు తీసుకుని వారిని సస్పెండ్ చేసింది. ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఐపీసీ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం), 505(1) బి (ప్రజలకు భయాన్ని కలిగించేలా చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తదుపరి విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News