Anam Ramanarayana Reddy: అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం: నేదురుమల్లి తీవ్ర విమర్శలు

Nedurumalli comments on  Anam

  • వైసీపీ నుంచి గెలిచిన ఏడాది నుంచే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపాటు
  • రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • చాలా కాలం నుంచే టీడీపీతో ఆనం, కోటంరెడ్డి టచ్ లో ఉన్నారని వ్యాఖ్య   

వైసీపీలో నెల్లూరు ఎమ్మెల్యేల అంశం కలకలం రేపుతోంది. నేరుగా పార్టీ అధిష్ఠానంపై ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు వెంకటగిరి నియోజకర్గంలో ఆనంకు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తోంది. 

తాజాగా నేదురుమల్లి మీడియాతో మాట్లాడుతూ ఆనంపై మండిపడ్డారు. వైసీపీ తరపున గెలిచిన తొలి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనం ఒక రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్ కు గురవుతోందని ఇప్పుడు చెపుతున్నారని... ఇంతకాలం ఎందుకు దీని గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని దుయ్యబట్టారు. ఆనంకు వయసు పెరిగిందని... ఆయనను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చాలా కాలం నుంచే టీడీపీతో ఆనం, కోటంరెడ్డి టచ్ లో ఉన్నారని అన్నారు.

  • Loading...

More Telugu News