Asha Malaviya: పర్వతారోహకురాలు ఆశా మాలవ్యకు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించిన సీఎం జగన్

CM Jagan announces ten lakhs to Asha Malaviya

  • దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన పర్వతారోహకురాలు
  • మహిళా సాధికారత, భద్రతా అంశాలపై ప్రచారం
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన ఆశా
  • అభినందించిన ఏపీ సీఎం

యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ను కలిసింది. దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ పై ప్రయాణించే లక్ష్యంతో ఆమె ఇప్పటిదాకా 8 రాష్ట్రాల్లో పర్యటించింది. 8 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగించింది. 

మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నది ఆశా మాలవ్య లక్ష్యం. భారతదేశాన్ని మహిళలకు సురక్షితమైనదిగా నిలపాలన్నది ఆమె ఆశయం. ఆమె ఆశయాలను తెలుసుకున్న సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. అంతేకాదు, అప్పటికప్పుడు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 

24 ఏళ్ల ఆశా మాలవ్య స్వస్థలం మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘర్ జిల్లా నతారాం గ్రామం. ఆమె తన సైకిల్ యాత్రను గత ఏడాది నవంబరు 1న భోపాల్ లో ప్రారంభించింది. ఇటీవల తమిళనాడులో యాత్ర పూర్తి చేసుకుని చెన్నై మీదుగా ఏపీలోకి ప్రవేశించింది. ఆశా మాలవ్య గతంలో టెంజింగ్ ఖాన్, బిసిరాయ్ పర్వతాలను అధిరోహించింది.

  • Loading...

More Telugu News