Kanna Lakshminarayana: ఆ విషయం పార్టీనే నిర్ణయిస్తుంది.. కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్య

Kanna lakshminarayana on his role in the TDP

  • పార్టీలో తన స్థానం ఏంటో పార్టీనే నిర్ణయిస్తుందని వ్యాఖ్య
  • పార్టీ అధినేత నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టీకరణ
  • వైసీపీపై ఘాటు విమర్శలు

బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరనున్నారు. అయితే పార్టీలో తన స్థానం ఏంటనే విషయంపై ఆయన మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో తన పాత్ర ఏమిటనేది పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ అధినేత నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు. 

వైసీపీ ప్రభుత్వంపైనా కన్నా నిప్పులు చెరిగారు. జగన్‌ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని వ్యాఖ్యానించారు. ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి ఆపై రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నవరత్నాల పేరిట ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని తరలింపు జగన్ దోపిడీ కోసమేనని కుండబద్దలు కొట్టిన ఆయన అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ఏపీని జగన్ బీహార్ కంటే అధ్వానంగా మార్చేశారని విమర్శించారు. 

జగన్ పదవిలోకి వచ్చిన నాటి నుంచీ రాష్ట్రంలో రాక్షస పాలన మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వైసీపీకి ఉంటే సీఎం ఎందుకు ప్రతిపక్షాల్ని చూసి భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు విధులు నిర్వహించని పక్షంలో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News