Tirupati: కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు!

Thugs poured petrol on the software engineer and set him on fire
  • తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘటన
  • కారులోనే సజీవ దహనమైన బాధితుడు
  • బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న నాగరాజు
  • కారులో స్వగ్రామం వెళ్తుండగా ఘటన
  • కారును ఆపి ఆపై ఘాతుకానికి పాల్పడిన దుండగులు
కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కారు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బాధితుడు కారులోనే సజీవ దహనమయ్యాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గుంగుడుపల్లె వద్ద జరిగిందీ ఘటన. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరించారు.

బాధితుడిని వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆయన పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఘటనకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Tirupati
Chandragiri
Software Engineer
Crime News

More Telugu News