godra riots: గోద్రా రైలు దహనం కేసులో 8 మంది దోషులకు బెయిల్

SC grants bail to 8 accused in Godhra train burning case

  • 2002లో గోద్రాలో రైలుకు నిప్పంటించి, 58 మంది మృతికి కారణమైన కేసు
  • 17 ఏళ్ళకు పైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారని బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు
  • నేరంలో కీలకపాత్ర పోషించిన నలుగురికి మాత్రం బెయిల్ తిరస్కరణ

2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. పదిహేడేళ్లకు పైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారనే దానిని ఆధారంగా చేసుకొని... సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. వీరంతా ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేరంలో కీలక పాత్ర పోషించిన మరో నలుగురికి మాత్రం బెయిల్ ను తిరస్కరించారు. ఈ నలుగురికి ట్రయల్ కోర్టు తొలుత మరణశిక్షను విధించింది. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీం కోర్టు ఈ రోజు గోద్రా నేరస్తుల బెయిల్ పిటిషన్ ల విచారణ చేపట్టింది. 

2002 ఫిబ్రవరిలో గోద్రా రైల్వే స్టేషన్ లో ఓ రైలుకు నిప్పంటించిన ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ లో పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీసింది. కేసు విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2011లో 31 మంది దోషుల్లో.... పదకొండు మంది దోషులకు మరణ శిక్ష, ఇరవై మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అనంతరం హైకోర్టు... ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే మరణ శిక్ష పడిన 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీనిపై దోషులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2018 నుండి ఇది పెండింగ్ లో వుంది.

  • Loading...

More Telugu News