AP High Court: ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court reserves verdict on R 5 Zone issue

  • అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్లు
  • హైకోర్టును ఆశ్రయించిన రైతులు
  • ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
  • సుప్రీంలో సవాల్ చేసిన రైతులు
  • ఏపీ హైకోర్టు తుది తీర్పుపై ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉండాలన్న సుప్రీం
  • ఏపీ హైకోర్టులో నేటితో ముగిసిన వాదనలు

అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు కూడా ఇళ్లు కేటాయించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఆర్-5 జోన్ ను సృష్టించడం తెలిసిందే. దీన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హైకోర్టులో నేటితో వాదనలు పూర్తయ్యాయి. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

ఈ వ్యవహారంలో రైతులు, ఏపీ ప్రభుత్వం తమ వాదనలను పూర్తి స్థాయిలో వినిపించగా, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

అమరావతిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దాదాపు 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆర్-5 జోన్ కు రూపకల్పన చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో రైతులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో రైతులు హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. 

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వవచ్చంటూనే, అయితే ఏపీ హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడే ప్రభుత్వ నిర్ణయం ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు వెలువరించనున్న తుది తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News