TDP: ఇసుక అంశంపై ఈ నెల 28, 29, 30 తేదీలలో టీడీపీ నిరసనలు

TDP will take protests for three days on sand issue
  • ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపణలు
  • ఎన్జీటీ ఆంక్షలను కూడా ఉల్లంఘిస్తున్నారని వెల్లడి
  • నిరసన కార్యాచరణ ప్రకటించిన టీడీపీ
టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, ఎన్జీటీ విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో యధేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని టీడీపీ ఆరోపించింది. అక్రమంగా ఇసుక మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటూ వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 28, 29, 30 తేదీలలో నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది. 

మొదటి రోజు (ఆగస్టు 28)

ఇసుక రీచ్ లు, ఇసుక డంపింగ్ యార్డుల వద్ద పార్టీ శ్రేణులు, ఆయా గ్రామస్తులతో కలిసి నిరసనలు చేపడతారు. అనంతరం ఇసుక తవ్వకాలపై ఆధారాలతో కూడిన వివరాలను మీడియాకు వివరిస్తారు.

రెండవ రోజు(ఆగస్టు 29)

ఇసుక తవ్వకాలపై తమ ఆరోపణలకు సంబంధించిన వివరాలను సాక్ష్యాధారాలతో సహా ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయనున్నారు.

మూడవ రోజు(ఆగస్టు 30)

అన్ని నియోజకవర్గ నాయకులందరూ విజయవాడ (ఇబ్రహీంపట్నం) లో ఉన్న DMG (Department of Mines & Geology) ప్రధాన కార్యాలయం ముట్టడి చేసి నిరసన చేస్తారు. తాము సేకరించిన ఆధారాలను DMG డైరెక్టర్ కు చూపించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరనున్నారు.
TDP
Sand
Mining
YSRCP
Andhra Pradesh

More Telugu News