Gudivada Amarnath: చంద్రబాబుకి ఇచ్చిన ఐటీ నోటీస్ లో లోకేశ్ పేరు కూడా ఉంది: గుడివాడ అమర్ నాథ్

Gudivada Amarnath asks TV5 and Andhrajyothy not to ask questions
  • చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు
  • ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్న
  • ఆంధ్రజ్యోతి, టీవీ5 మినహా మిగిలిన వాళ్లు ప్రశ్నలు వేయాలన్న మంత్రి  
ప్రముఖ మీడియా సంస్థలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లను వైసీపీ నేతలు ఎల్లో మీడియా అంటూ ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ రెండు సంస్థలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. గుడివాడ అమర్ నాథ్ ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 మినహా మిగిలిన వాళ్లు ప్రశ్నలు వేయాలని ఆయన చెప్పారు.   

అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రూ. 118 కోట్లు చాలా చిన్న తీగ మాత్రమేనని, పెద్ద డొంక ఉందని అన్నారు. నోటీస్ లో లోకేశ్ పేరు కూడా ఉందని చెప్పారు. సీమన్స్ కంపెనీ రూ. 3 వేల కోట్ల స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, జైలు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఈడీ కూడా కలగజేసుకోవాలని చెప్పారు.
Gudivada Amarnath
YSRCP
TV5
ABN Andhra Jyothy

More Telugu News