Chandrababu: చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది... జోక్యం చేసుకోండి: మోదీకి కనకమేడల విజ్ఞప్తి

Kanakamedala wrote PM Modi to intervene into Chandrababu health issue
  • చంద్రబాబుకు జైల్లో అనారోగ్యం
  • డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న టీడీపీ అధినేత
  • చంద్రబాబు ఆరోగ్యం పట్ల పార్టీ నేతల్లో ఆందోళన
  • ప్రధాని మోదీకి లేఖ రాసిన కనకమేడల
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పట్ల పార్టీ నేతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు చుట్టూ ఏదో జరుగుతోందన్న ఆందోళన వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 

రిమాండ్ లో ఉన్న చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని, ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్టు నివేదికలు వచ్చాయని, కానీ చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతినేలా జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని కనకమేడల ఆరోపించారు. 

చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని, ఒక్కసారిగా అంత బరువు తగ్గడం కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. పైగా, చికిత్స పేరిట చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించారు. 

చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని నివేదికలు చెబుతున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ లేఖ రాస్తున్నట్టు కనకమేడల వివరించారు.
Chandrababu
Health
Kanakamedala Ravindra Kumar
Narendra Modi
TDP
Andhra Pradesh

More Telugu News