Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు గెలిస్తే వాలంటీర్ల స్థానంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి: సజ్జల

Sajjala says if Chandrababu won the elections Janmabhoomi Committees will come again
  • వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు గతంలో విషం చిమ్మారన్న సజ్జల
  • ఇప్పుడు ఎన్నికల వేళ వారిపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు
  • నాలుగు ఓట్ల కోసం బూటకపు హామీలు ఇస్తున్నారని ఆగ్రహం 
వాలంటీర్ వ్యవస్థపై తమకు వ్యతిరేకత లేదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతుండడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాలంటీర్లపై గతంలో విషం కక్కిన చంద్రబాబు, దత్తపుత్రుడు ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 

ఏపీలో వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చేసింది చంద్రబాబేనని, చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. 2014లో ఎలాంటి మోసాలు చేశాడో, చంద్రబాబు ఇప్పుడు కూడా అలాంటి మోసాలే చేస్తున్నాడని, నాలుగు ఓట్ల కోసం బూటకపు హామీలు ఇస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఒకప్పుడు వాలంటీర్లపై ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు వారిని కొనసాగిస్తామని చెబుతున్నారని, ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. 

చంద్రబాబు గనుక గెలిస్తే వాలంటీర్ల స్థానంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని సజ్జల స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలు చెప్పినవారికే పథకాలు ఇస్తారని తెలిపారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Volunteers
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News