Department of Telecommunication: 28,000 ఫోన్లను బ్లాక్ చేయండి.. డాట్ కీలక ఆదేశాలు

DoT orders blocking of more than 28000 mobiles
  • 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫికేషన్‌ చేయాలంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సూచన
  • సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలలో టెలికం వనరుల దుర్వినియోగానికి  అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
  • డాట్‌కు సహకరించనున్న కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసులు
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలలో టెలికాం వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా డాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్) రంగంలోకి దిగింది. పొంచివున్న డిజిటల్ ముప్పు నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలంటూ టీఎస్‌పీలకు (టెలికం సర్వీస్ ప్రొవైడర్స్) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఏకంగా 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని సూచించింది. ఈ ప్రక్రియలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీసులు డాట్‌కు సహకారం అందించనున్నారు. 

కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసుల విశ్లేషణ ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు వివిధ సైబర్ క్రైమ్‌లలో దుర్వినియోగమయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లతో ఏకంగా 20 లక్షల నంబర్లు ఉపయోగించారు. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగా 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని, ఈ హ్యాండ్‌సెట్‌లకు అనుసంధానించిన 20 లక్షల మొబైల్ కనెక్షన్‌లను తిరిగి నిర్ధారించుకోవాలని టీఎస్‌పీలకు డాట్ స్పష్టం చేసింది. రీ-వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయిన కనెక్షన్లను తొలగించాలని సూచించింది.
Department of Telecommunication
Mobiles
Telecom Operators

More Telugu News