Satyendra Baitha: గాడిద‌పై స‌వారీ చేస్తూ లోక్‌స‌భ అభ్య‌ర్థి ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెట్టింట వీడియో వైర‌ల్!

Independent Candidate Satyendra Baitha Takes Donkey Ride in Gopalganj To Lure Voters

  • బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో స‌త్యేంద్ర బైథా
  • గాడిద‌పై కూర్చొని ఇంటింటికీ తిరుగుతూ వినూత్నంగా ఓట్లు అడుగుతున్న వైనం
  • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతోనే ఇలా ప్ర‌చారం చేస్తున్న‌ట్లు వెల్ల‌డి

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు వినూత్న రీతుల్లో ప్రచారం నిర్వ‌హిస్తుంటారు. ఇదిగో ఇక్క‌డ చెప్పుకోబోయే లోక్‌స‌భ అభ్య‌ర్థి కూడా ఇదే కోవ‌కు వస్తారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి స‌త్యేంద్ర బైథా అనే వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఆయ‌న ఇప్పుడు ముమ్మ‌రంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే, అంద‌రిలా కాకుండా సత్యేంద్ర గాడిద‌పై కూర్చొని ఇంటింటికీ తిరుగుతూ వెరైటీగా ఓటర్ల‌ను ఓటు అడుగుతున్నారు. ఇలా వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారాయ‌న‌. 

ఇక గోపాల్‌గంజ్ ప‌రిధిలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన స‌త్యేంద్రను ఎందుకు ఇలా గాడిదపై ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నార‌ని అడిగితే.. ఆయ‌న‌ ఒక బ‌ల‌మైన కార‌ణాన్ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయ‌ని, త‌న‌లాంటి సాధార‌ణ వ్య‌క్తి వాటి కోసం ఖ‌ర్చు చేసే స్థితిలో లేడ‌ని అంటున్నారు. అందుకే తాను ఇలా గాడిద‌పై ప్ర‌చారం చేస్తున్న‌ట్లు వివ‌రించాడు. చివ‌రికి తాను నామినేష‌న్ వేయ‌డానికి కూడా క‌లెక్ట‌రేట్‌కు గాడిద‌పైనే వెళ్లిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఇక స‌త్యేంద్ర వెరైటీగా గాడిద‌పై తిరుగుతుండ‌డం చూసి చాలా మంది ఆయ‌న‌తో ఫొటోలు దిగుతున్నారు‌.  

ఈ క్ర‌మంలో ఒక‌వేళ మీరు గెలిస్తే ఎలాంటి మంచి ప‌నులు చేస్తార‌ని స‌త్యేంద్ర‌ను అడిగితే.. జిల్లాలో చ‌క్కెర ఫ్యాక్ట‌రీ, యూనివ‌ర్శిటీ తీసుకువ‌స్తాన‌ని అంటున్నారు. అలాగే త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తాన‌ని చెబుతున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు గోపాల్‌గంజ్ నుంచి గెలిచిన చాలా మంది అభ్య‌ర్థులు స్థానికంగా ఉండ‌లేక‌పోయార‌ని, కేవలం జిల్లా కేంద్రంలో ఉంటూ ఎప్పుడో ఒక‌సారి ప్ర‌జ‌ల‌కు క‌నిపించార‌ని తెలిపారు. వారు ఎక్కువ‌గా ఢిల్లీ లేదా పాట్నాలో ఉన్నార‌న్నారు. కానీ, తాను స్థానికుడిని కాబట్టి ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని స‌త్యేంద్ర చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ లోక్‌స‌భ అభ్య‌ర్థి వెరైటీ ఎన్నిక‌ల ప్ర‌చారం తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇక ఆరో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మే 25వ తేదీన గోపాల్‌గంజ్‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ లోక్‌స‌భ స్థానంలో ఎన్‌డీఏ త‌ర‌ఫున అలోక్ కుమార్ సుమ‌న్ బ‌రిలో ఉంటే.. ఇండియా కూట‌మి నుంచి చంచ‌ల్ కుమార్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News