Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు పాక్ నుంచి ఏకే 47 తుపాకులు.. పోలీసుల విచారణలో వెల్లడి

Bishnoi Gang Brought Weapons From Pakistan To Eliminate Salman Khan

  • హీరో కదలికలపై 15- 20 మందితో నిఘా
  • పన్వేల్ లోని ఫాంహౌస్ వద్ద బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల తిష్ట
  • సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరిపేందుకు ప్రణాళిక

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఆ దిశగా భారీ ప్రణాళికలే వేసినట్లు తాజాగా బయటపడింది. సల్మాన్ కదలికలపై నిరంతరం నిఘా వేయడంతో పాటు ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల పరిశోధనలో బయటపడింది. ఇందుకోసం పాకిస్థాన్ నుంచి ఏకే 47 సహా పలు ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాక్ కు చెందిన ఓ ఆయుధాల సప్లయర్ నుంచి ఏకే 47, ఎం 16, ఏకే 92, హై కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు పేర్కొన్నారు.

బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు పలు సంచలన విషయాలు తెలిశాయని సమాచారం. ఈ కాల్పుల ఘటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పుల కేసును లోతుగా దర్యాఫ్తు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను ప్రశ్నించగా.. సల్మాన్ ను హత్య చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ భారీ ప్రణాళిక రచించినట్లు బయటపడింది.

ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ నివాసంతో పాటు పన్వేల్ లోని ఆయన ఫాంహౌస్ వద్ద బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు నిఘా పెట్టారని పోలీసులు తెలిపారు. హీరో కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఏకంగా పాతిక మంది వరకు ఫాంహౌస్ సమీపంలో తిష్ట వేశారని చెప్పారు. కాగా, రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్‌ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది.

  • Loading...

More Telugu News