5 run penalty: భారత్‌తో మ్యాచ్‌లో అమెరికాకు 5 పరుగుల పెనాల్టీ!

after taking a more than minute between overs for three times in an innings USA handed five run penalty

  • ‘స్టాప్ క్లాక్ రూల్’ని అతిక్రమించడంతో ఆతిథ్య జట్టుకు ఊహించని షాక్
  • ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం 60 సెకన్ల వ్యవధిలో కొత్త ఓవర్ మొదలవ్వాలి
  • మూడు సార్లు అతిక్రమిస్తే 5 పరుగుల జరిమానా

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-అమెరికా జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ కీలక దశలో అనూహ్య పరిణామం జరిగింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు 30 బంతుల్లో 35 పరుగులు అవసరమైన దశలో భారత విజయ లక్ష్యం నుంచి 5 పరుగులను అకస్మాత్తుగా తగ్గించారు. పరుగులు రాబట్టడం క్లిష్టంగా మారిన నసావు కౌంటీ పిచ్‌పై సాధించాల్సిన పరుగుల్లో 5 తగ్గడం భారత్‌కు కలిసొచ్చింది. ఇదే సమయంలో ఆతిథ్య అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌లో ఓవర్ల మధ్య సమయం 60 సెకండ్లకు మించకూడదు. 1 నిమిషం వ్యవధిలోనే తదుపరి ఓవర్ మొదలు కావాల్సి ఉంటుంది. దీనిని ‘స్టాప్ క్లాక్ రూల్’ అని అంటారు. ఈ విషయంలో ఫీల్డింగ్ జట్టు చాలా అప్రమత్తంగా ఉండాలి. 60 సెకన్లలోనే కొత్త ఓవర్‌ను మొదలు పెట్టాలనే నిబంధనను ఇన్నింగ్స్‌లో మూడు సార్లు అతిక్రమిస్తే ఆ జట్టు స్కోరు నుంచి 5 పరుగుల పెనాల్టీని విధిస్తారు. అంటే ఆ జట్టు మొత్తం స్కోర్ నుంచి 5 పరుగులను తగ్గిస్తారు. అమెరికా వర్సెస్ భారత్ మ్యాచ్‌లోనూ జరిగింది ఇదే. అమెరికా మొత్తం 110 పరుగులు సాధించగా అందులో 5 పరుగులు తగ్గించారు. దీంతో భారత్ విజయ లక్ష్యం 106 పరుగులకు తగ్గింది. పర్యవసానంగా మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ సునాయాసంగా విజయం సాధించింది.

కాగా 5 పరుగులు పెనాల్టీగా విధించడంతో అమెరికా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్‌ ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. కొత్త నిబంధన గురించి వివరించడంతో అసంతృప్తితో వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News