Sledges: టీమిండియాలో ఎక్కువ స్లెడ్జింగ్ చేసేది కోహ్లీ కాద‌ట‌.. ఆసీస్ ఆట‌గాళ్లు ఎవ‌రి పేరు చెప్పారంటే..!

Australian Cricketers Pick India Star Who Sledges The Most

  • ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో ఎక్కువ స్లెడ్జ్ చేసేది రిష‌భ్ పంత్ అన్న ఆసీస్ ప్లేయ‌ర్లు
  • తాజాగా సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ 
  • అయితే, తాను ప్రేమ‌గా మాత్ర‌మే స్లెడ్జింగ్ చేస్తాన‌న్న పంత్‌
  • త‌న స్లెడ్జ్‌లో ఎక్క‌డా దుర్భాష‌లాడ‌టం ఉండ‌ద‌ని వెల్ల‌డి

ఆస్ట్రేలియా, భార‌త్ మధ్య మ్యాచ్ అంటే త‌ప్ప‌నిస‌రిగా ఆట‌గాళ్ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఉంటుంది. అదేనండి స్లెడ్జింగ్‌. మ్యాచ్ మ‌న దగ్గ‌ర జ‌రిగినా, మ‌నం ఆసీస్ గ‌డ్డ‌పై ఆడినా కొన్ని సంద‌ర్భాల్లో ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు మైదానంలో ఒక‌రిపై ఒక‌రు నోరుపారేసుకుంటూ వుంటారు. ఈ విష‌యంలో టీమిండియా నుంచి దూకుడుగా వ్య‌వ‌హరించే విరాట్ కోహ్లీ ముందుంటార‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాళ్లు విరాట్ కాకుండా 'ఎక్కువగా స్లెడ్జ్ చేసే' భారత క్రికెట‌ర్‌ ఎవ‌రో చెప్పారు. 

ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్‌వుడ్, నాథన్ లైయ‌న్, పాట్ కమిన్స్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషేన్ ఇలా అంద‌రూ ఒక‌రి పేరే చెప్పారు. అది ఎవ‌రో కాదు.. భార‌త వికెట్ కీప‌ర్ రిషభ్‌ పంత్! అత‌నే ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో అత్యధిక స్లెడ్జ్‌లు చేసే ఆటగాడు అని వారు తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన వీడియోలో ఇలా వారు ఏక‌గ్రీవంగా పంత్ పేరు చెప్ప‌డం ఉంది. 

ఇక అదే వీడియోలో పంత్ 2018 సిరీస్‌లో ఆసీస్ వికెట్ కీప‌ర్‌ టిమ్ పైన్‌తో తన స్లెడ్జింగ్ ఘ‌ట‌న‌ల‌ను గుర్తుచేసుకోవ‌డం కూడా ఉంది. తన స్లెడ్జింగ్ కార‌ణంగా అప్పటి ఆస్ట్రేలియన్ ప్రధాని తనను గుర్తించ‌డం వ‌ర‌కు తీసుకెళ్లింద‌ని పంత్ పేర్కొనడం మ‌నం వీడియోలో చూడొచ్చు.

"ఎవరూ ప్లాన్ చేసి స్లెడ్జ్‌ చేయరు. కానీ ఎవరైనా చేస్తే అది నాకు న‌చ్చ‌దు. అందుకే నేను మర్యాదగా స్లెడ్జ్ చేస్తాను. నా స్లెడ్జింగ్ అనేది సీరియ‌స్‌గా మాత్రం ఉండ‌దు. జ‌స్ట్ జోకింగ్‌గా స్లెడ్జ్ చేస్తుంటా. ఆస్ట్రేలియ‌న్లు న‌న్ను 'బిగ్ ఎంఎస్ ఇక్కడ ఉన్నారు, 'రండి హోబర్ట్‌లో టీ 20 క్రికెట్ ఆడండి, మీకు బాగా వస్తుంది. బేబీ సిట్ మై కిడ్స్' అని స్లెడ్జ్ చేస్తుంటారు" అని పంత్ చెప్పుకొచ్చాడు. 

ఇదిలాఉంటే.. వ‌చ్చే నెల భార‌త్ బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ సిరీస్‌లో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడ‌నుంది. నవంబ‌ర్ 22న ఈ టూర్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News