Priyanka Gandhi: గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లుగా ఉంది: ఢిల్లీ కాలుష్యంపై ప్రియాంక గాంధీ

It was like entering a gas chamber says Priyanka Gandhi
  • ఢిల్లీలో వాయు కాలుష్యంపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన
  • వయనాడ్‌లో వాయు నాణ్యత సూచీ 35గా ఉందని వెల్లడి
  • ఢిల్లీలో వరుసగా రెండో రోజు 400 దాటిన సూచీ
ఢిల్లీలో వాతావరణ పరిస్థితిపై ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని వయనాడ్ నుంచి ఢిల్లీ తిరిగి వచ్చానని ఇక్కడి వాతావరణ కాలుష్యం ఆందోళన కలిగిస్తోందన్నారు. వయనాడ్‌లో వాయు నాణ్యత సూచీ 35గా ఉండగా, ఇక్కడ మాత్రం ఓ గ్యాస్ ఛాంబర్‌లోకి ప్రవేశించినట్లుగా కనిపిస్తోందన్నారు.

ఢిల్లీలో కాలుష్యం ఎప్పటికప్పుడు పెరుగుతోందన్నారు. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి అన్నారు. పరిశుభ్రమైన గాలి కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పని చేయాల్సి ఉందని సూచించారు.

కాగా, ఢిల్లీలో వరుసగా రెండో రోజు వాయునాణ్యత సూచీ 400 దాటింది. గురువారం ఉదయం వాయు నాణ్యత 428గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3 అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.
Priyanka Gandhi
Congress
New Delhi

More Telugu News