Vote Counting: దేశంలో అందరి దృష్టి ఇటువైపే... మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే!

Vote counting in Maharashtra and Jharkhand tomorrow
  • మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ నెల 20తో ముగిసిన పోలింగ్
  • నవంబరు 23న ఓట్ల లెక్కింపు
  • విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కూటముల నేతలు
ఈ నెల 20తో మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఝార్ఖండ్ కు రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా, మహారాష్ట్రలో ఒక్క విడతలోనే పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో, రేపు (నవంబరు 23) ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దాంతో, దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ రెండు రాష్ట్రాలపైనే ఉంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే విజయం తమదే అని ధీమాగా ఉన్నాయి. 

కాగా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా... బీజేపీ-శివసేన (షిండే)-ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతి కూటమి ఓవైపు... కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్ థాకరే)-ఎన్సీపీ (ఎస్ సీపీ)లతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి మరోవైపు ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. రేపు ఈ పార్టీల అదృష్టం ఎలా ఉండనుందో వెల్లడి కానుంది. 

ఇక, ఝార్ఖండ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 81 స్థానాలు ఉండగా... ఈ నెల 13న జరిగిన తొలి విడతలో 43 స్థానాలకు, ఈ నెల 20న జరిగిన రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా నువ్వా నేనా అన్నట్టుగా అధికార జేఎంఎం-కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి... బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి పోరు జరిగింది. దాంతో కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఎగ్జిట్ పోల్స్ లో అత్యధికం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమిదే విజయం అని వెల్లడైంది. మరి వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

ఇక, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా రేపే జరగనుంది.
Vote Counting
Maharashtra
Jharkhand
Assembly Elections

More Telugu News